ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతివ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. "వెలుగు నీడలు" చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ ఓ సన్నివేశానికి ఆత్రేయ రచించాడు. ఈ సినిమాలో కథానాయకుడు చంద్రానికి టి.బి.వ్యాధి సోకుతుంది. డాక్టర్లు చంద్రాన్ని పరిశీలించి అతని భార్యకి కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాక "డాక్టర్లు ఏమన్నారు?" అని చంద్రం భార్యను అడిగిన సన్నివేశం అద్భుతంగా ఉంటుంది.
ప్రాణాలు మింగేటు వంటి టి.బి.వ్యాధి అతనికి ఉందని తెలిసినా చంద్రం నిబ్బరంగా ఉంటాడు. కారణం అతని తత్వం ; వేదాంత ధోరణి,జీవిత రహస్యం తెలిసిన వాడుగనుకనే "ఎందరో మహానుభావులు, మహాత్ములు...." అనే వాక్యాన్ని ఆ పాత్ర ద్వార ఆత్రేయ పలికిస్తాడు. అలాగే విషాదంలో వేదాంత ధోరణినే కాక జీవిత రహస్యాన్ని కూడా ఆత్రేయ ఈ సంభాషణలో తెలిపారు. " మనిషి చాలాకాలం బ్రతుకుతాడన్నా అబద్దం కంటే..."అనే వాక్యంలో జీవిత పరమార్థాన్ని పాత్రద్వారా ఆత్రేయ పలికిస్తాడు.