"ఆత్రేయ పాటల్లో లోతైన భావాలు,జీవిత సత్యాలు,ఎంతో మేధస్సు ఇమిడి వున్నాయి. ప్రజల ఆలోచనలు,ఊహాగానాలు ఆయన పాటల్లో వుట్టిపడుతుంటాయి. మనిషి జీవిత అనుభవాలు,చీకటి,వెలుతురు,అపజయాల గురించి ఆయన హృదయాలకు హత్తుకునే విధంగా పాటలు రాశారు" ~ కీ.శే.ఎన్.టి.రామారావు     "మానవ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, గెలుపు ఓటములను అనుభవాలను ప్రతిబింబిస్తూ మనసుల్ని కదిలించే విధంగా ఆయన రాసిన పెక్కు పాటలు చిరస్మరణీయాలై నిలిచాయి" ~ ఎన్.టి.రామారావు     "ఆత్రేయ వ్రాసిన పాటలన్నీ ప్రజల మనోభావాలను పుణికిపుచ్చుకుని ఉండేవి" ~ఎన్.టి.రామారావు     "ఆత్రేయ అంటే తెలుగు సాహితీ రంగంలో సాంఘిక నాటక యుగ కర్త, ఆత్రేయ అంటే తెలుగు సినీ జగత్తులో మాటల పసిడి కోట,పాటల ముత్యాలపేట" ~ డా.సి.నా.రె.     "బరువైన భావాల కొండలను చిటికెను వేలుపై గోవర్ధన గిరివలె సునాయాసంగా తేలిక మాటల్లో వహించడం,వచించడం గీతాచార్యుడికే(ఆత్రేయ)తెలుసు" ~వేటూరి సుందరరామ మూర్తి     "భాషను అదుపు చేయడంలోను, భావాన్ని అదుపు చేయడంలోను తిమ్మెర వంటి తేలిక మాటలతో తేనెలు, తీయని తావులు వెదజల్లడం ఆచార్యుడు(ఆత్రేయ)తిక్కనకు వారసుడు" ~వేటూరి సుందరరామ మూర్తి     "సినీ సాహితీ రంగంలో అపర శ్రీనాథుడు. తెలుగు సినిమా పాటకు సాహిత్య మందిరంలో పట్టాభిషేకం చేయించినవాడు" ~గొల్లపూడి మారుతీరావు     "శృంగారమైనా,మమకారమైనా తేలిక పదాలతో చదువుకున్న వాణ్ణి ,చదువులేని వాణ్ని గుండె లోతులవరకూ కదిలించగల ప్రతిభ ఆత్రేయది" ~ గొల్లపూడి మారుతీరావు     " తెలుగు సినిమాకు ఒక గొప్ప రూపాన్ని కల్పించిన రచయిత. తనదైన బాణీని ఇచ్చిన రచయిత ఆత్రేయగారు" ~గొల్లపూడి మారుతీరావు     "ఆత్రేయ వ్రాసిన పాటల్లో ప్రతి పల్లవి తీసుకొని ఒక కథ వ్రాయవచ్చు. అంత గంభీరమైన,భావస్పోరకమైన భాష ఆత్రేయది" ~కె.ఎస్.ప్రకాశరావు     " తెలుగు భాష తెలిసిన నటీనటులకు ఆత్రేయ సంభాషణలు పంచభక్ష్య పరమాన్నాలతో వడ్డించిన విస్తరి." ~ గుమ్మడి వెంకటేశ్వరరావు      "శ్రీ ఆత్రేయ వ్యక్తిగా చాలా నిరాడంబరుడు. ఆయన విలువ ఆయనకే తెలియని ఒక సామాన్యుడు. కత్తితో కోస్తే రక్తం వస్తే, ఆయన కలంతో రాస్తే రక్తం ఉడుకెక్కుతుంది. మనసు ఉరకలేస్తుంది.రాసినవాడికి కాదు, ఆయన రాసింది చదువుకునే వాడికి! ~ శ్రీ కె.విశ్వనాథ్     " శ్రీ ఆత్రేయ గారు స్వయంగా నటుడు, ప్రయోక్త,రచయిత కాబట్టి ప్రతి డైలాగు రాసిన తర్వాత నటుడిగా నటించుకొని, ప్రయోక్తగా ఎంతవరకూ కావాలో కుదించుకొని, అక్షరలక్షలుగా వ్రాయటం, ఆయనలోని ప్రత్యేకత." ~ మురళీమోహన్     " ఎక్కడ ఇపోతాయో...అన్నంత పొదుపుగా తన సంభాషణా రచనలో మాటల్ని వాడుకున్నవాడు ఆత్రేయ" ~తనికెళ్ళ భరణి     "తెలుగు సినిమా పాటకో మనసుని, ఉన్నతమైన భావాన్ని ఇచ్చిన ఘనత ఆత్రేయకు దక్కుతుంది." ~కె.రామలక్ష్మి ఆరుద్ర     "మామూలు మాటలతో పాటలని పొదగ వచ్చు అనే విషయాన్ని మొట్ట మొదటిగా ప్రదర్శించి చెప్పింది, ఆచరించి చూపింది ఆచార్య ఆత్రేయ" ~కొంగర జగ్గయ్య     "వేమన తరువాత ఆత్రేయ పుట్టాడు. అంత తేట తెలుగుదనం ఉంది ఆయన రచనలో" ~ హీరో కృష్ణంరాజు     "ఆత్రేయగారి డైలాగ్స్ కి ట్యూన్ కడితే పాట,ఆయన పాటని ట్యూన్ లేకుండా చదివితే డైలాగ్" ~సత్యానంద్     "సినీ సంభాషణా శైలిని పరిశీలిస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అన్నట్లుగా "ఆత్రేయ పూర్వం-ఆత్రేయ తర్వాత" అని ఖచ్చితంగా అనవచ్చు." ~తోటపల్లి మధు.      "బరువైన తేలిక పదాలతో మనసుకు,మనిషికి కొత్త భాష్యాన్ని చెప్పినవారు ఆత్రేయ" ~డా.పర్వతనేని సుబ్బారావు     "తెలుగు సినీ జగత్తుని తన పాటల మాటల వెన్నెల జల్లుతో నిరంతరం పరవశింప జేస్తున్న నెలరేడు ఆత్రేయుడు" ~డా.తలతోటి పృథ్వి రాజ్

Monday, May 7, 2012

Acharya Athreya 92 Jayanthi


    రచయితలకు దిక్సూచి ఆత్రేయ   
     "నేటి తెలుగు సినిమా పాటల , మాటల రచయితలకు దిక్సూచి ఆచార్య ఆత్రేయ" అని మద్దుల అప్పారావు అన్నారు. ఆత్రేయ సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో అనకాపల్లి శాఖా గ్రంధాలయంలో సోమవారం ఉదయం 9 గంటలకు మనసుకవి, మన"సు"కవి ఆచార్య ఆత్రేయ 92  వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అప్పారావు మాట్లాడుతూ "గీతాచార్యుడు ఆచార్య ఆత్రేయ. ఆయన పాటలు, మాటలు తెలుగువారి మనస్సులో చిరస్మరణీయం" అని అన్నారు. తొలుత ఆత్రేయ సాహితీ స్రవంతి సభ్యులు ఆత్రేయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కర్రి దివాకర్ ఆత్రేయ నిరాడంబర తనాన్ని, ఆత్రేయ వ్యక్తిత్వాన్ని సభకు వివరించారు. రాయక నిర్మాతల్ని,రాసి ప్రేక్షకుల్ని ఆత్రేయ ఏడిపిస్తాడు అనే లోకవ్యవహారంలోని మాటవెనుక ఆత్రేయ గొప్పగా రాయాలని తపించేవాడని చెప్పాడు. ఆత్రేయ సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి డా.ఇమ్మిడిసెట్టి చక్రపాణి మాట్లాడుతూ ఆత్రేయ సాహితీ స్రవంతి ప్రతి ఏటా ఆత్రేయ గారి జయంతి వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న కార్యక్రమాలను, చిత్రపరిశ్రమలోని ప్రముఖ రచయితలు ఇస్తున్న "ఆత్రేయ సాహితీ పురస్కారాలను " సభకు వివరించారు.
    ఆత్రేయ సాహితీ స్రవంతి వ్యవస్థాపక అధ్యక్షులు డా.తలతోటి పృథ్వీ రాజ్ www.acharyaathreya.com అనే వెబ్ సైట్ ను రూపొందించి దానిద్వార ఆత్రేయ సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండేందుకు ఇప్పటివరకు ఆత్రేయ సాహితీ స్రవంతి తరఫున చేసిన కృషిని సభకు వివరించారు. ప్రముఖ కథకులు జి.రంగబాబు అతిథులను  వేదిక మీదకు  ఆహ్వానించగా , శిష్ట్లా తమ్మిరాజు ప్రార్థనా గీతంతో మొదలైన కార్యక్రమం  గట్టి బ్రహ్మాజీ వందన సమర్పణతో ముగిసింది. ఈ కార్యక్రమంలో గ్రందాలయాదికారిణి వరలక్ష్మి, గ్రందాలయ సిబ్బంది, ఆత్రేయ అభిమానులు పాల్గొన్నారు.  
ఆత్రేయ జయంతి చిత్రమాలికలు  

పూలమాలతో ఆత్రేయ చిత్రపటాన్ని అలంకరించి నివాళి అర్పిస్తున్న ఆత్రేయ సాహితీ స్రవంతి సభ్యులు. 

అతిథులను వేదికమీదకి ఆహ్వానిస్తున్న హైకూ క్లబ్ గౌరవ అధ్యక్షులు శ్రీ  జి.రంగబాబు. 

శ్రీ శిష్ట్లా తమ్మిరాజు ప్రార్థనా గీతంతో ప్రారంభమైన కార్యక్రమం.

ప్రసంగిస్తున్న ఆత్రేయ సాహితీ స్రవంతి గౌరవ అధ్యక్షులు శ్రీ కర్రి దివాకర్ 


ముఖ్య అతిథిగా ఆత్రేయపై మాట్లాడుతున్నా హైకూ క్లబ్  పోషకులు శ్రీ మద్దుల అప్పారావు    



ఆత్రేయసాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శిడా.ఇమ్మిడిసెట్టి చక్రపాణి 

ఆత్రేయసాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శిడా.ఇమ్మిడిసెట్టి చక్రపాణి 

సభకు హాజరైన సాహిత్యాభిమానులు 

వందన సమర్పణ చేస్తున్న హైకూ క్లబ్ ప్రధాన కార్య దర్శి  శ్రీ గట్టి బ్రహ్మాజీ 


No comments:

Post a Comment